అమరావతి కోసం 150 రోజులుగా అలుపెరగకుండా పోరాటం సాగిస్తున్న రైతులకు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమ వందనాలు తెలిపారు. ట్విట్టర్లో ఈ అంశంపై స్పందించిన లోకేష్... రైతు పోరాటానికి జయహో అంటూ కీర్తించారు. లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు ఇవేవీ రైతుల స్పూర్తిని దెబ్బతీయలేకపోయాయన్న లోకేష్.. జై అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. ఇలా అణచివేత ప్రదర్శించిన ప్రతీసారీ అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. భేషజాలకు పోకుండా సర్కారు ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు.