కేంద్రం చెప్పిన మాట మేం వినం అన్నట్లుంది పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు. ఆమె చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లాక్డౌన్ సడలింపులతో జనం రోడ్ల మీద బీభత్సంగా తిరిగేస్తున్నారు. పోలీసులు సైతం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పగలు సరే రాత్రిళ్లు కూడా అలా చేస్తే కుదరదంటూ కేంద్రం.. దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమలు చేయాలని తాజా మార్గదర్శకాల్లో ప్రకటించింది.
కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను అమలు చేయదని సీఎం మమతా బెనర్జీ ప్రకటించి రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేశారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పని సరిగా అమలు చేసేలా చూడాలని, రాష్ట్రాలు విచ్ఛిన్నం కాకూడదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ రాత్రి కర్ఫ్యూలేదని ప్రకటించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు, ఒక్క కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో స్టోర్స్, మాల్స్ అన్నీ ఓపెన్ చేసుకోవచ్చని మమత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.