గుంటూరు జిల్లా తాడేపల్లిలో విజయవాడకు చెందిన ఓ యువకుడిని కిడ్నాప్ చేశారు. స్థానిక రౌడీషీటర్లు ఈ పని చేసినట్లు గుర్తించారు పోలీసులు. యువకుడిని హింసించిన కిడ్నాపర్లు.. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. మీ కొడుకుని చంపేసి కృష్ణానదిలో పడేస్తామంటూ బెదిరించారు. దీంతో.. తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు.. కేవలం అర గంటలోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాపర్ల గ్యాంగులో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రౌడీషీటర్ల కదలికలపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు.