ఉత్తరప్రదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనం, కంటైనర్ ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. వారిలో అయిదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజస్థాన్ నుంచి బీహార్లోని భోజ్పూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రతాప్గఢ్ ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. వాజిద్పూర్ గ్రామంలో జరిగిన ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, కారు..
ప్రమాదం అనంతరం లోహపు కుప్పగా మారిందని.. మృతదేహాలను బయటకు తీసుకురావడానికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఘటనలో స్కార్పియో డ్రైవర్ తీవ్రంగా గాయపడి లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.. గాయపడినవారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.