కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌

Update: 2020-06-09 22:53 GMT

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆప్షన్ ఇచ్చింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే ఆఫీసులకు రావాలని ఆదేశించింది. మిగతావాళ్లు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పని చేయాలని స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావొద్దని సూచించింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు రావాలని పేర్కొంది. ఎదురెదురుగా కూర్చోవడాన్ని నిషేధించిన కేంద్రం, ఇంటర్‌కాంలోనే మాట్లాడుకోవాలని ఆదేశించింది. మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి గా పెట్టుకోవాలని ఆదేశించిన కేంద్రం, మాస్క్‌ పెట్టుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని సూచించింది. కామన్ ఏరి యాలో గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. ఎవరికి వారు తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడాలని సూచించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరిగింది. దేశంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాజిటివ్ కేసులు వస్తున్నా యి. నీతి ఆయోగ్ ఆఫీసు, జాతీయ మీడియా కేంద్రాల్లో పని చేసే సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో ఆఫీసులకు రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Similar News