దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అన్లాక్ 1.0 సాగుతోందని, అన్లాక్ 2.0 ఎలా అమలుచేయాలో ఆలోచించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా నియంత్రణపై సీఎం లతో ప్రధాని మోదీ చర్చించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మోదీని కోరారు. స్పందించిన మోదీ, మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
కరోనా పరీక్షలన పెంచడానికి టెస్టింగ్ సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. కరోనా బారిన పడిన వారి పట్ల వివక్ష చూపడం తగదని చెప్పారు. కొవిడ్-19 బారినపడి కోలుకునే వారిసంఖ్య పెరగడం వైరస్ వ్యాప్తి కట్టడికి సానుకూల సంకేతమన్నారు. దేశవ్యాప్తంగా 9 వందలకు పైగా టెస్టింగ్ ల్యాబ్లున్నాయని, లక్షల సంఖ్యలో కోవిడ్ పడకలు, వేలాది క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు కూడా సరిపడనంతా ఉన్నాయని వివరించారు. కరోనాపై ప్రజల్లో నాటుకుపోయిన భయాన్ని పారద్రోలేలా చర్యలు తీసుకోవాలని సీఎంలకు సూచించారు. కరోనా నుంచి పెద్ద సంఖ్యలో రోగులు కోలుకుంటున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ముఖానికి మాస్క్లు ధరించాలని, ఇన్ఫెక్షన్ సోకకుండా తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.