తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ మధ్య కూడా బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విజయవాడలో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై అధికారులు చర్చలు జరిపారు. అంతర్ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకొనేందుకు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చారు. త్వరలో మరోసారి సమావేశమై ఒప్పందంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సర్వీసులు పునరుద్ధరించడానికి ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, కంటైన్మెంట్ జోన్లపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నాలుగు దశల్లో సర్వీసులు పునరుద్ధరించాలని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చారు. తొలి దశలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణకు 256 సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదించారు...
ఇప్పటికే ఏపీ సరిహద్దులో ఉన్న నాలుగు రాష్ట్రాలకు ఏపీఎస్ఆర్టీసీ లేఖలు రాయగా, కర్ణాటక మాత్రమే ముందుకొచ్చింది. దీంతో కర్ణాటకకు పరిమిత సంఖ్యలో బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేసింది ఏపీఎస్ఆర్టీసీ. రెండ్రోజుల క్రితమే అనంతపురం డిపో నుంచి బెంగుళూరుకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొదట 168 సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు దశల వారీగా ఐదు వందలకు బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించారు.
బస్సుల్లో భౌతిక దూరంతో పాటు మాస్కులు, శానిటైజేషన్ తప్పనిరి చేశారు. బస్టాండ్లలో కూడా కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ అధికారులతోనూ చర్చలు జరగడంతో... సర్వీసుల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. వారంలోగా మరో సారి ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశంలో చర్చలు జరిపిన నిర్ణయం తీసుకోనున్నారు.