చైనా తీరుతో.. సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు

Update: 2020-06-19 11:10 GMT

ఎల్‌ఏసీలో దురాక్రమణలకు తెరతీస్తున్న చైనా తీరుతో.. సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గల్వాన్ లోయ నుంచి వైదొలిగి.. ఎవరి భూభాగం నుంచి వారు పనిచేసుకోవచ్చంటూ భారత్ ప్రతిపాదించినా చైనా మొండివైఖరి వీడడం లేదు. మేజర్ జనలర్‌ స్థాయిలో ఇప్పటికే 3 దఫాలుగా చర్చలు జరిగినా ఓ అంగీకారం కుదరలేదు. సరిహద్దుల్లో అదనపు బలగాల ఉపహంహరణకు PLA ఒప్పుకోకుండా.. మరింతగా మోహరిస్తోంది. ఇప్పటికి అసంతృప్తిగా చర్చలు ముగిసిన నేపథ్యంలో ఇవాళ కూడా మరోమారు భేటీ జరిగే అవకాశం ఉంది. అలాగే 23న భారత్‌-చైనా విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతోంది. గల్వాన్ లోయపై సార్వభౌమాధికారం తమదేనన్న చైనా వాదన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన భారత్.. ఇలాంటి ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే LAC విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారు. అటు.. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఫోన్లో మాట్లాడారు. హద్దు మీరితే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని గట్టిగానే హెచ్చరించారు.

అటు, ఇనుపముళ్లతో కూడిన రాడ్‌లతో భారత సైనికులపై జరిపిన దాడిపై చైనా సమాధానం చెప్పడం లేదు. అమరులైన జవాన్ల పోస్ట్‌మార్టంలో బయటపడిన విషయాలు చూస్తే PLA దళాలు పథకం ప్రకారం ఎంత క్రూరంగా ప్రవర్తించాయో అర్థం చేసుకోవచ్చు. ఏదైమైనా ఈ విషయంలో చైనాకు కళ్లెం వెయ్యాలంటే పరిమిత స్థాయిలో సైనిక చర్య చేపట్టి తీరాల్సిందే అనే వాదన కొందరు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఈశాన్య లద్దాఖ్‌లో మిలటరీ యాక్షన్ అవసరమని వారు వాదిస్తున్నారు. రాజకీయంగా, దౌత్యపరంగా ఒత్తిడి పెంచుతూనే.. వాణిజ్యపరంగానూ చైనాను ఇబ్బందుల్లోకి నెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు.

చైనా తీరు మారని నేపథ్యంలో గాల్వన్ లోయపై ఎట్టి పరిస్థితుల్లో పట్టు కోల్పోకుండా భారత సైన్యం కాపు కాస్తోంది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఓ పక్క చైనా కుట్రల్ని బయటపెడుతూనే.. చైనాను నిలువరించేందుకు భద్రతా బలగాల్ని పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంవైపు మోహరిస్తోంది. చైనాకు చెందిన 2 వందలకు పైగా వాహనాలు, భారీగా సైనికులు గాల్వన్ లోయ ప్రాతంలో ఉన్న విషయాలు ఇప్పటికే ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడింది. జూన్‌ 6న తేదీన రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం చైనా ఉల్లంఘించిన నేపథ్యంలో.. సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

మరోవైపు, గాల్వన్ ఘటన తర్వాత మనదేశాన్ని దెబ్బతీయడానికి చైనా కుట్రలు పన్నుతూనే ఉంది. మనదేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్, నేపాల్‌లను ఎగదోస్తోంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. భారతదేశం చైనాపై దాడికి దిగితే పాకిస్థాన్, నేపాల్ నుంచి కూడా ప్రతిఘటన ఉంటుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల గురించి ప్రస్తావించిన గ్లోబల్ టైమ్స్, పీఓకే, ఆర్టికల్-370 రద్దులను కూడా ప్రస్తావించింది. పొరుగుదేశాలతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని, అందువల్ల చైనాపై దాడి చేసే సాహసానికి భారతదేశం ఒడి గట్టబోదని అభిప్రాయపడింది.

Full View

Similar News