ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయి. ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం అనర్హత వేటుకు భయపడ్డారు. ఈ ముగ్గురు.. వైసీపీ అభ్యర్థులకు ఓటు వెస్తే అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఎవరికీ చెల్లకుండా టిక్లు పెట్టారు. దీంతో ఈ మూడు ఓట్లు చెల్లవని ప్రకటించారు రిటర్నింగ్ అధికారులు.
పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశారో చూపించాలన్న నిబంధన ఉంది. దీంతో ఈ ముగ్గురు 1 అని సంఖ్య వేయడానికి బదులుగా అడ్డగీత పెట్టారు. ఈ మూడింటితో పాటు చెల్లకుండా పోయిన మరో ఓటు కూడా టీడీపీ ఎమ్మెల్యేదేనని తేలింది. ఏపీలో మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది పోలింగ్లో పాల్గొన్నారు. టీడీపీ చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఓటింగ్కు హాజరు కాలేకపోయారు. ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడు, సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటింగ్కు దూరంగా ఉన్నారు.