ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలపై నేడు (సోమవారం ) నిర్ణయం వెలువడనుంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లతో ఉన్నత విద్యా మండలి అధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జులైలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. కరోనా తీవ్రత కారణంగా అవి తాత్కాలికంగా వాయిదా వేశారు.. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలా లేక రద్దు చేయాలా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని ఎస్వీయూల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించకుండా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వైస్ ఛాన్సులర్లు వ్యక్తపరుస్తున్నారు. ఉన్నత విద్యామండలి అధికారులతో భేటీలోనూ ఇదే విషయాన్ని చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు.