ప్రభుత్వం అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడి కుట్రలు చేస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు అరెస్టు చేయడానికి ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగిందని... ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారని అన్నారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పిందని... నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించిందని గుర్తు చేశారు.
10 రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటన్నారు. అసలీ అర్థరాత్రి కుట్రలేంటని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారన్నారు.
ఇది కేసు విచారణలా లేదని, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకులేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయన్నారు.
అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. న్యాయపరంగా తామూ పోరాడతామని... ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.