మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని భివాండి ముంబై-ఆగ్రా హైవేపై జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఒకరు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సలీం ఖాన్ (35) అనే వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్ మీద బోరివాలి వైపు వెళుతుండగా వాల్షింద్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో ఖాన్ భార్య అర్బినా (26), కుమారులు వాసిమ్ (6), రిహాన్ (3) అక్కడికక్కడే మృతి చెందారు. ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి.. దాంతో స్థానికులు అతనిని భివాండిలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఘటనపై ఐపిసి సెక్షన్ 304 మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.