తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసి పరిధిలోనే 80 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పెరుగుతున్న కేసులను కట్టడి చెయ్యడానికి హైదరాబాద్లో 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించనట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో అవసరమైతే జీహెచ్ఎంసి పరిధిలోనే మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. లాక్డౌన్ అనేది చాలా పెద్ద విషయమని.. దీనిపై ప్రభుత్వ యంత్రాగాన్ని లాక్ డౌన్ కు తగిన విధంగా సన్నద్ధం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అన్ని నగరాల తరహాలోనే హైదరాబాద్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని సీఎం అన్నారు. ఈ సందర్బంగా చెన్నై నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించిన విషయాన్నీ ప్రస్తావించారు. లాక్ డౌన్ కు సంబంధించి మూడు రోజుల్లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్టు
సీఎం వెల్లడించారు.