Kalvakuntla Kavitha : కవితకు మళ్లీ చిక్కులు.. వదలని సీబీఐ..

Update: 2026-03-13 10:45 GMT

కల్వకుంట్ల కవిత చుట్టూ మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే ఆమెకు ఈ కేసులో ఊరట లభించిందనే సంతోషం మళ్లీ ఆవిరవుతోంది. దేశంలోనే సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కవితతో పాటు ఈ కేసులో ఉన్న అందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రావాలంటూ సీబీఐ అధికారులు కవితకు ఆమె ఇంట్లో నోటీసులు అందజేశారు. దీంతో కవిత పేరు మరోసారి దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కవిత ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టే క్రమంలో చాలా బిజీగా తిరుగుతున్నారు. తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు బాగానే కష్టపడుతున్నారు.

ఇలాంటి సమయంలో ఆమెను మరోసారి కేసు చిక్కులు చుట్టు ముడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కానీ రౌస్ అవెన్యూ కోర్టు ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ హైకోర్టులో విచారణ అంటే.. ఇప్పట్లో వెంటనే తీర్పు వచ్చే పరిస్థితులు కూడా కనపిఇంచట్లేదు. కాబట్టి విచారణ పేరిట హైకోర్టులో ఇంకా ఎన్ని సంవత్సరాలు కేసు నడుస్తుందో చెప్పలేని పరిస్థితి. కానీ ఈ కేసు ఇంతకు ముందు ఉన్నంత సీరియస్ గా ఉండే పరిస్థితి లేదని కవిత అనుచరులు అంటున్నారు.

కేంద్రం తమ మీద కక్షతోనే ఇలాంటి కేసులు పెడుతోందని ఆమె వర్గం ఆరోపిస్తోంది. తన మీద ఎన్ని కుట్రలు చేసినా సరే రాజకీయంగా తనను తొక్కేయలేరంటూ కవిత చెబుతోంది. మే నెలలో కొత్త పార్టీని పెట్టేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది. ఓ వైపు కేసు నడుస్తున్నా సరే.. తన రాజకీయ పార్టీ ఏర్పాట్లు ఆపట్లేదు కవిత. అంటే ఆమె కేసులను లెక్కచేయకుండా ముందుకు వెళ్లాలని బలంగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News