దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు. అయితే కరోనా నిర్ధారణకు టెస్టులు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న జనం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో వైరస్ నిర్ధారణ శాంపిళ్లను వేగంగా పరీక్షించేందుకు భారత కంపెనీలు 'ఆటోమేటెడ్ టెస్టింగ్ మెషీన్' ను ఆవిష్కరించాయి.
ఆటోమేటెడ్ టెస్టింగ్ మెషీన్ను పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ మెషిన్ గంటకు 32 కొవిడ్ పరీక్షలు చేయగలదు.
ప్రస్తుతం అందుబాటులో కరోనా టెస్టు కిట్లతో పోలిస్తే.. ఇది అతి తక్కువ మానవ ప్రమేయంతో పరీక్షలను సాఫీగా పూర్తి చేయగలదు. దీని నిర్వహణకు ఒకే ఒక టెక్నీషియన్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి రెండు రకాల టెస్టింగ్ యంత్రాలను తయారు చేశామని.. ఒక మెషిన్ ధర రూ.40 లక్షలని ఎస్ఐఐ సీఈవో వెల్లడించారు.