దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల విపరీతంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదవడం గమనార్హం. గత సోమవారం రాత్రికి దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరగా.. ఈ శుక్రవారం రాత్రికి 8,14,898కి చేరింది.
ఇక కరోనాతో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజే 475 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్యను 7,93,802గా తెలిపింది. కాగా, దేశంలో రోజువారీ కేసులు 25 వేలు దాటడం ఇదే తొలిసారి.
కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4.95 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 62.09కు చేరిందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.72కు తగ్గిందని.. గత నెలలో ఇది 2.82 శాతం ఉండేదని కేంద్ర సర్కార్ వివరించింది.