దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక బీహార్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా లేకపోవటం వలన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది. తాజాగా బిహ్తా ప్రాంతంలో ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి కరోనా వైరస్ సోకింది.
బిహ్తాలో జూలై 10న వ్యాపారవేత్త రాజ్ కుమార్ గుప్తా హాస్పిటల్లో మృతి చెందాడు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత అతని అల్లుడు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి పాజిటివ్ వచ్చింది. తర్వాత అతని కుటుంబంలో మరొకరికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న 37 మందికి అధికారులు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. అందులో 20 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో బిహ్తా ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.
కాగా, బీహార్లో ఇప్పటివరకు 16,642 మంది కరోనా బారినపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ర్టవ్యాప్తంగా 143 మంది ప్రాణాలు కోల్పోయారు.