దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులతో హాస్పిటల్లు నిండిపోతున్నాయి. అయితే ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్ల నుంచి కొందరు పారిపోతున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని కొందరు.. కుటుంబంపై బెంగపెట్టుకున్నామని మరి కొందరు.. రకరకాల కారణాలతో హాస్పిటల్ నుంచి రోగులు పారిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ కరోనా రోగి తనకిష్టమైన పాన్ కోసం ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.
ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతనికి పాన్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో శనివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. లాక్ డౌన్ కారణంగా ఆస్పత్రి పరిసరాల్లో ఎలాంటి షాపులు ఓపెన్ చేయలేదు. దీంతో ఆ కరోనా రోగి గాంధీ నగర్ వెళ్లాడు. అక్కడ ఓ షాపులో పాన్ తీసుకుని తిన్నాడు. అనంతరం అక్కడున్న తన బంధువుల ఇంటికెళ్లి.. తనను ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించండి అని కోరాడు. చేసేదేమీ లేక వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, వైద్యులు అతన్ని తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.