కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలో భాగంగా ఈ ఏడాది బోనాలను ఎవరికి వారే ఇళ్లలో అమ్మవారికి బోనం సమర్పించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 19, 20 తేదీల్లో చిలకలగూడ కట్టమైసమ్మ, నల్లపోచమ్మ బోనాల జాతరకు భక్తులకు ఆలయాల్లో అనుమతి లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. ఇదే విధంగా కవాడి గూడ కనకాల కట్టమైసమ్మ ఆలయానికి భక్తులు ఎవరూ రావొద్దని ఆలయ చైర్మన్ గోల్కొడ గౌతమ్ కుమార్ పటేల్, దేవాదాయ శాఖ ఈవో కె. సాంబశివరావు తెలిపారు. రాంనగర్ డివిజన్ పరిధిలోని పోచమ్మ ఆలయం 19,20 తేదీల్లో మూసివేస్తున్నట్లు చైర్మన్ జనార్ధన్ తెలిపారు. అమీర్ పేటలోని ఎల్లమ్మ దేవాలయంలోకి 19న భక్తులకు ప్రవేశం లేదని ఈవో అన్నపూర్ణ తెలిపారు.