దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 34 వేలకు కేసులు నమోదవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 1.30 లక్షల పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 11 లక్షల మార్కును దాటాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 40,425 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,90,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని మరో 7,00,087 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా కరోనా వైరస్తో కొత్తగా 681 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 27,497కు చేరింది.