దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరగుతూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో రోజూ 2 లక్షలకు పైగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి. అయితే అవి ఏమాత్రం సరిపోవంటున్నారు నిపుణులు. వైద్య పరికరాలు లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించబడటం లేదు. ఈ కారణంగా కరోనా సంక్రమణ సంఖ్య ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు టెస్టుల ఆర్థిక భారాన్ని తగ్గించే అద్భుత పరికరాన్ని ఐఐటీ ఖరగ్పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు. తాము తయారుచేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ పరికరంతో కేవలం రూ.400కే కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించవచ్చని ఐఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుమన్ చక్రవర్తి తెలిపారు. ఆర్టీ- పీసీఆర్ విధానంతో సమానమైన కచ్చితత్వంతో ఈ పరికరం ఫలితాలను వెల్లడిస్తుందని తెలిపారు.