విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ఏర్పాటు చేస్తున్న వందే భారత్ విమానాలను దుండగులు బంగారం అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. శుక్రవారం వందేభారత్ మిషన్ విమానాల్లో హైదరాబాద్ వచ్చిన 11 మంది ప్రయాణికులు లోదుస్తుల్లో బంగారం తరలించేందుకు యత్నించారు. అక్రమంగా తరలిస్తున్న 3.11 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వందే భారత్ మిషన్ విమానంలో సౌదీ అరేబియాలోని దామన్ నుంచి శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీచేశారు. ఈ నేపథ్యంలో లోదుస్తుల్లో 3.11 కిలోల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.కోటి 66 లక్షలు ఉంటుందని అంచనా. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.