కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రపంచ మానవాళిని భయకంపితుల్ని చేస్తుంటే మరోవైపు కొందరు మాత్రం తమకు సోకిన వైరస్ ను ఇతరులకు అంటించేందుకు ప్రయత్నిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కరోనా సోకిన కొందరు పక్కింటి డోర్లను ముట్టుకోవడం, వారి ఇంటిముందు ఉమ్మివేయడం చేస్తున్నారు. వారు ఉపయోగించిన చెప్పులు, బట్టలను పక్క ఫ్లాట్ వద్ద కావాలని వేస్తూ వైరస్ అంటించే ప్రయత్నం చేస్తూ.. శాడిజం చూపిస్తున్నారు. హిమాయత్ నగర్ లోని కోరుట్ల భవన అపార్ట్మెంట్ లో ముగ్గురు కుటుంబసభ్యులకు కరోనా సోకింది.
వారు హోమ్ క్వారంటైన్ లో వుంటున్నారు. అందరికి దూరంగా ఇంట్లోనే ఉండి చికిత్స పొందాల్సిన వీరు ఇష్టానుసారంగా బయటకు వస్తూ పక్కవారి ఫ్లాట్ డోర్స్ ను కావాలనే తాకుతున్నారు. తమకు అంటిన వైరస్ పక్కవారికి కూడా అంటించాలని బట్టలు, చెప్పులు వారి ఇంటిముందు వేస్తున్నారు. ఈ తతంగం అంతా సీసీ టీవీలో రికార్డు కావడంతో వారి ఆగడాలు బయటపడ్డాయి.