Political Parties Election Campaign: ముగిసిన నామినేషన్ల పర్వం, పెరిగిన ప్రచార వేగం
అగ్రనేతలు రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు , అభ్యర్ధులు ఇంటింటి ప్రచారం;
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమకు మద్దతిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటున్నారు.
లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో ప్రచారం హోరెత్తుతోంది. ఓటర్లను ఆకట్టుకునేలా హామీలిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ గుర్తును వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలవ్వాలంటే 14 MP సీట్లివ్వాలని హస్తం నేతలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేందుకు భారాసకు మద్దతివ్వాలంటూ గులాబీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుస్థిర పాలనతో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మరోసారి అవకాశమివ్వాలంటూ కమలనాథులు ఇంటింటికి తిరుగుతున్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్న కాంగ్రెస్.. కేంద్రంలో మద్దతిస్తే ప్రత్యేక నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. భువనగిరి MP అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పరిధిలోని మార్నింగ్ వాకర్స్తో కలిసి చిట్చాట్ నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణకి మంచిర్యాలలోనేతకాని సంఘం నేతలు మద్దతు ప్రకటించారు. సుల్తానాబాద్ MLA చింతకుంట విజయరామారావు వంశీకృష్ణ తరపున ఇంటింటికి వెళ్లి ఓట్లడిగారు. పదేళ్ల ప్రజావ్యతిరేక భాజపా పాలనను గద్దే దించేందుకు ప్రజలంతా సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకి మద్దతుగా చందుర్తి మండలంలో ప్రచారం చేశారు. . వరంగల్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ఓట్లడిగారు. ఖమ్మం అభ్యర్థి రఘురాం రెడ్డి కూరగాయల మార్కెట్లోని దుకాణాల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో.... పలువురు భారాస సర్పంచులు, MPTC సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హస్తం పార్టీలో చేరారు. ఆరు గ్యారంటీల అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్న బండి సంజయ్ సవాల్పై మండిపడిన పొన్నం పదేళ్లలో కేంద్రంలో భాజపా సర్కార్ ఎన్ని అమలు చేసిందో చెప్పాలని ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణల వల్లే సంజయ్ అధ్యక్ష పదవి తొలగించారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆరు గ్యారంటీల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకే రిజర్వేషన్లపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని భాజపా నేతలు విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో కొండావిశ్వేశ్వర్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా గోషామహల్లో మాజీ కేంద్రమంత్రి శ్రీరాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఇంటింటికి వెళ్లిన బండిసంజయ్..అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. ఇంటింటికి భాజపా పేరుతో ఓట్లభ్యర్థించిన అర్వింద్...బ్రిటీష్ పాలకుల కంటే ఎక్కువగా కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని ఆరోపించారు