కర్ణాటకలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇటీవల సీఎం యెడియూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా సీఎం కార్యాలయంలోని ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆరుగురు ఉద్యోగులు కరోనా హాస్పిటల్లో చేరారు. సీఎంకు, ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయిన తర్వాత కార్యాలయాన్ని, ఇంటిని శానిటైజ్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు.. తమను కలిసిన వారంతా హోం ఐసోలేషన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక సీఎం యెడియూరప్పతో పాటు ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.