పట్టీసీమ ద్వారా ఈ సంవత్సరం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామ నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీం పట్నం పెర్రీ ఘాట్ పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మలో కలిసిన పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జాలాలకు జలహారతి ఇచ్చి పసుపు, కుంకుమతోపాటు చీర, సారెలను విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మిశాలతో కలిసి సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడనీ పేర్కొన్నారు. కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబుడని, జగన్ పట్టిసీమను వట్టి సీమ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదులకు జలకల సంతరించేలా చర్యలు చేపట్టారనీ తెలిపారు.
గోదావరి కృష్ణా నదులు అనుసంధానం వల్ల కృష్ణ డెల్టా దిగువ బాగాన ప్రజలు, రైతులకు అవసరమైన తాగునీరు కష్టాలు తీరాయన్నారు. రూ.1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, 2014-19 లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణాడెల్టాకు తరలించడం ద్వారా రూ. 50వేల కోట్ల ఆదాయం వచ్చిందనీ తెలిపారు. 2014-19 లో 5 ఏళ్లలో 263 టీఎంసీ లకు పైగా గోదావరి జలాలు కృష్ణ డెల్టాకు తరలించాం. ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువనీ చెప్పారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 428 కు పైగా టీఎంసీ లను కృష్ణాకు తరలించామని, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం కంటే ఎక్కువనీ చెప్పారు.
నాడు టీడీపీ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగు నీరందిస్తుంటే , వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్ట్ లు మరుగున పడ్డాయనీ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ మేనేజ్మెట్ ద్వారా అన్ని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగమని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే, జగన్ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందనీ, వెంటిలేటర్ మీద ఉన్న ఆర్ధిక వ్యవస్థ కు చంద్రబాబు , పవన్ కళ్యాణ్, మోదీ ల సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోస్తున్నారనీ వివరించారు.