బద్వేల్ బరిలో 15 మంది అభ్యర్థులు.. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ..
ఏపీలో బద్వేల్ ఉప ఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత 15 మంది బరిలో నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.;
ఏపీలో బద్వేల్ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత 15 మంది బరిలో నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చివరి రోజైన బుధవారం నాడు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న వైసీపీ... వెంకట సుబ్బయ్య భార్య ప్రముఖ గైనకాలజిస్టు దాసరి సుధను అభ్యర్థిగా నిలిపింది. సాంప్రదాయాలను గౌరవిస్తూ టీడీపీ, జనసేన ఉపఎన్నిక పోరుకు దూరంగా ఉన్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ పోటీకి సై అనడంతో ఏకగ్రీవ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ నుంచి కమలమ్మ, బీజేపీ నుంచి సురేష్ పోటీపడుతున్నారు. వీరితో పాటు మరో 12 మంది స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.