వైసీపీ ఎమ్మెల్యేలకు.. జగన్ ఝలక్
గ్రాఫ్ ఆధారంగానే టిక్కెట్లంటూ 18 మంది ఎమ్మెల్యేలకు అక్టోబరు డెడ్లైన్ పెట్టడంతో ఉలిక్కిపడుతున్నారు.;
వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఝలక్ ఇచ్చారు. 18 మంది ఎమ్మెల్యేలు చాలా వెనుకబడి ఉన్నారంటూ వారికి టికెట్ పరీక్ష పెట్టారు. సరిదిద్దుకునేందుకు వారికి అక్టోబరు వరకు డెడ్లైన్ పెట్టారు. ఆ 18 మంది ఎవరనేది వారికి తెలుసన్న జనగ్ గడప గడపకు కార్యక్రమంలో ఎన్నిసార్లు చెప్పినా వారు సరిగా తిరగలేదన్నారు. వారు ఎంతమేర తిరిగారో, వారి పనితీరు ఎలా ఉందో వ్యక్తిగతంగా నివేదికలు పంపుతామన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో సీరియస్గా తిరగాలని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే పార్టీ ఎమ్మెల్యేలందరి పనితీరుపై సర్వేలు చేపడతామని, ప్రజల్లో గ్రాఫ్ బాగుందని వచ్చేవారికే టికెట్ ఉంటుందని, గ్రాఫ్ లేనివారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వడం వారికీ, పార్టీకీ నష్టమేనన్నారు. అక్టోబరు నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జుల్లో మార్పులు, చేర్పులు చేపడతామని వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష సదస్సులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో హాట్ టాపిక్గా మారాయి.
జగన్ పెట్టిన టికెట్ పరీక్షపై వైసీపీ ఎమ్మెల్యేల్లో అసహనం మొదలైంది. గ్రాఫ్ ఆధారంగానే టిక్కెట్లంటూ 18 మంది ఎమ్మెల్యేలకు అక్టోబరు డెడ్లైన్ పెట్టడంతో ఉలిక్కిపడుతున్నారు. జగన్ చెప్పినట్లు గడప గడపకూ వెళ్తే జనం నిలదీతలు తప్పవని భయపడుతున్నారు. వెళ్తే జనం నిలదీతలు వెళ్లకుంటే టికెట్ కోతలు మొత్తానికి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఇదే సమయంలో ఇంతకీ పడిపోయిన గ్రాఫ్ ఎవరిదనే చర్చ ప్రారంభమైంది. ఓటమికి ఎమ్మెల్యేలను బాధ్యుల్ని చేస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముందు జగన్ గ్రాఫ్ బాగుంటే ఎవరైనా గెలవాలి కదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంతకీ ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై విస్తృత చర్చ మొదలైంది. సమావేశం ముగిశాక బయటకొస్తూ వారు దానిపైనే చర్చించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఒక మంత్రి, కోస్తాంధ్రలో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మంత్రి, రాయలసీమలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు వంటివారు ఉన్నట్లు చర్చ జరిగింది. 18 మందిలో కొందరిని ఇప్పటికే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారని, సర్దుకోవాలని వారికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.