తారు వేయకుండా రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్
రోడ్డు వచ్చిందన్న ఆనందం కూడా ఆ గిరిజనులకు లేకుండా పోయింది.;
రోడ్డు వేసి నెలరోజులు కూడా కాలేదు.అంతలోనే కంకర తేలిపోయింది.మొత్తం ఇసుకే బయటపడింది.రోడ్డు వచ్చిందన్న ఆనందం కూడా ఆ గిరిజనులకు లేకుండా పోయింది. ఇదీ అల్లూరి జిల్లాలో కనిపించిన రోడ్ల దుస్థితి. జీకే వీధి మండలం, పెద్దవలస పంచాయితీ, చాపరాతి పాలెం నుంచి డోకులూరు మీదుగా బంధవీధి వరకు ఈ తారు రోడ్డు పనులు చేపట్టారు. నిర్మించిన నెలరోజుల్లోనే ఈ రోడ్డు ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ రోడ్డుపై వెళ్తుంటే బైక్, ఆటోలు, వ్యాన్లు స్కిడ్ అయిపోతున్నాయి. నాణ్యత లేని రోడ్డు వేసి కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటున్నారు ఇక్కడి గిరిజనులు. అసలు తారు కూడా వేయకుండా రోడ్డు నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించడం వల్ల తమ ప్రాణాలు పోతున్నాయంటున్నారు. ఇటీవల ఓ ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందినట్లు చెబుతున్నారు గ్రామస్థులు. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని ఈ రోడ్డును తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.