AI: కృత్రిమ మేధతో దోమలపై దండయాత్ర
ఏఐ సాయంతో దోమల నియంత్రణ.. దేశంలోనే తొలిసారి ఏపీలోనే అమలు;
ఆంధ్రప్రదేశ్లో దోమలపై దండయాత్రను కూటమి ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల అంతానికి పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. నూతన టెక్నాలజీతో దోమలపై యుద్ధాన్ని ప్రకటించబోతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల కాలం కూడా వచ్చేసినట్లే. ఈ సీజన్లో దోమల వల్లే రోగాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014లో దోమలపై దండయాత్ర వంటి కార్యక్రమం చేపట్టిన సీఎం చంద్రబాబు... ప్రస్తుతం దోమలపై దండయాత్రకు ఏఐను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏఐలో అత్యధికంగా దోమలు ఉండే ప్రాంతాలను గుర్తించడం సహా ఆయా ప్రాంతాల్లో దోమల వ్యాప్తి, నివారణ కోసం ఏఐతో పనిచేసే సరికొత్త వ్యవస్థను తీసుకురానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ మస్కిటో సర్వెలెన్స్ సిస్టమ్ (SMoSS)ను త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక స్మార్ట్ వ్యవస్థలను ఏపీలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న చంద్రబాబు తాజాగా దోమల నిర్మూలనకు ఏఐను వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏఐ ఆధారితంగా పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. ఆరు కార్పోరేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సక్సెస్ అయితే మిగిలిన ప్రాంతాలలో అమలు చేయనుంది .
66 ప్రాంతాల్లో అమలు
ఏపీలోని 6 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలోని 66 ప్రాంతాల్లో పైలట్ ప్రాతిపదికన స్మార్ట్ మస్కిటో సర్వెలెన్స్ సిస్టమ్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ విశాఖలో 16 ప్రాంతాల్లో, కాకినాడలో 4, రాజమహేంద్రవరంలో 5, విజయవాడలో 28, నెల్లూరులో 7, కర్నూలులో 6 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో AIతో పని చేసే స్మార్ట్ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ‘స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్’ ద్వారా దోమల సాంద్రత ఎక్కువైతే వెంటనే అధికారులకు అలర్ట్లు వెళ్తాయి. అంతేకాదు డేటా సెంట్రల్ సర్వర్కు చేరుతుంది. అక్కడి నుంచి అధికారులు రియల్ టైమ్ డాష్బోర్డు ద్వారా పర్యవేక్షించి దోమలు అంతమెుందించేందుకు చర్యలు తీసుకుంటారు. అప్పుడు దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేగంగా ఫాగింగ్కు వెంటనే చర్యలు తీసుకోవచ్చని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. అలాగే డ్రోన్లను ఉపయోగించి లార్వాసైడ్ చల్లడం వల్ల తక్కువ రసాయనాల వినియోగంతో దోమలను నివారించనున్నట్లు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.