TDP Mahanadu : మహానాడులో ఏఐ ఎన్టీఆర్‌ ప్రసంగం: అభిమానుల్లో ఉత్సాహం

Update: 2025-05-29 06:15 GMT

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం రెండో రోజు ఈ మహానాడులో విశేషం చోటు చేసుకొంది. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా పార్టీ అధినాయకత్వం ఆయన ప్రసంగాన్ని కొత్తగా రూపొందించింది. మహానాడు వేదికపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా ఎన్టీఆర్ ప్రసంగాన్ని తెరపై ప్రదర్శించారు. ఈ ప్రదర్శన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. "మహా వేడుకలా, పసుపుమయమై జరుగుతున్న ఈ మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో ప్రతిభ చూపిస్తున్న కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సు మాంజలి"... అంటూ ఏఐ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

"సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది. నా తెలుగువారి కోసం, నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాను అనేకంటే... పుట్టిందని చెప్పడమే సరైంది" అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏఐ ఎన్టీఆర్ ప్రస్తావించారు. తాను ప్రారంభించిన పథకాలు, అందించిన సంక్షేమాన్ని గుర్తుచేస్తూ, చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్తుత సంక్షేమ పథకాలపై ప్రశంసలు జల్లు కురిపించారు. అంతేకాకుండా, మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేషు చూస్తుంటే ముచ్చటేస్తోంది. భళా మనవడా.. భళా అంటూ యువనేతను అభినందించారు. సర్వే జన సుఖినోభవంతు అంటూ.... ఏఐ ఎన్టీఆర్ ప్రసంగం ముగిసింది. ఈ ఏఐ ప్రసంగం మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎం తో ఉద్వేగానికి, ఆశ్చర్యానికి గురిచేసింది.

Tags:    

Similar News