Pawan Kalyan: విజయవాడలో పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం

పవన్‌ కల్యాణ్‌కు వై ప్లస్ సెక్యూరిటీ కేటాయించిన సర్కార్;

Update: 2024-06-18 06:30 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన జనసేన అధినేతకు గన్నవరం విమానాశ్ర‌యంలో ఆ పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ‌న‌సేనాని రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.

ఇక పవన్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వెళ్తున్నారు. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. మంత్రిగా బుధవారం ఆయ‌న తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను ప‌రిశీలించిన అనంత‌రం సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని స‌మాచారం.

కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని కేటాయించ‌డం జ‌రిగింది. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విష‌యం విదిత‌మే. ఈ తరుణంలో ఆయన భద్రతకు భరోసానిస్తూ, ముందస్తు చర్యగా.. ఆయనకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..  

Tags:    

Similar News