FIBERNET: 1863 వ్యూస్ కే ఆర్జీవీకి రూ. 2 కోట్లా..?
రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.2.10 కోట్లు ఆర్జీవీకి ఇచ్చారన్న జీవీరెడ్డి;
వైసీపీ హయాంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు పైబర్నెట్ సంస్థ తరఫున రూ.2.10 కోట్లు చెల్లించినట్టు ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి అన్నారు. వ్యూస్ ప్రకారం వ్యూహం సినిమాకు డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. వ్యూహం సినిమాకు 1863 వ్యూస్ వచ్చాయని, ఒప్పందం ప్రకారం రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.2.10 కోట్లు వర్మకు కట్టబెట్టారని ఆరోపించారు. మొత్తం మీద ఆ సినిమాకు 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని... కానీ ప్రభుత్వం ఆయనకు ఫైబర్ నెట్ నుంచి రూ. రెండు కోట్ల పదిహేను లక్షలు చెల్లించిందని వెల్లడించారు. అంటే ఒక్కో వ్యూకు రూ. 11వేలకుపైగా చెల్లించారని అన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయ్యిందని జీవీ రెడ్డి తెలిపారు.
ఆర్జీవీ మెడకు మరో ఉచ్చు
వివాదాస్పద సినీ దర్శకుడు ఆర్జీవీ మరో వివాదంలో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తీసిన వ్యూహం సినిమాకు పే ఫర్ వ్యూ పద్దతిలో ఏపీ ఫైబర్ నెట్ కు ఇచ్చారు. ఈ విషయాన్ని కొత్తగా ఫైబల్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న జీవీరెడ్డి ప్రకటించారు. . గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారును చేసిన సంస్థకు మెయింటెనెన్స్ పేరుతో వేలకోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని.. పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
నియామక పత్రాలు లేకుండానే ఉద్యోగాలు
నియామక పత్రాలు లేకుండా ఫైబర్ నెట్ సంస్థ లో ఉద్యోగాలు ఇచ్చారని, వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలయకుండా ఉందని, ఒక్క వాట్సప్ మెసేజ్ తో ఉద్యోగం, వేల రూపాయలు జీతం ఇచ్చారన్నారు. ఇలా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారని, వీరంతా వేరే చోట పనిచేస్తూ, సంస్థలో మాత్రం జీతాలు తీసుకున్నారన్నారు. విచారణ మొత్తం పూర్తి అయ్యాక గత ప్రభుత్వం చేసిన అవకతవకల మొత్తాన్ని బయట పెడతామన్నారు. కేబుల్ ఆపరేటర్ లను స్థానికంగా ఉన్న విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, పోల్ కి వైర్లు ఉంటే తొలగించడం సరి కాదని, మీకు ఇబ్బంది ఉంటే మా దృష్టి కి తీసుకురమ్మని, ఇటువంటి చర్యలు చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నామన్నారు. అనేక ఆరోపణలు వచ్చిన ఓ మహిళా ఉద్యోగినిని ఉద్యోగం నుంచి తొలగించామన్నారు.ఆమె ఫైబర్ నెట్ ఫైళ్లను విజయసాయిరెడ్డికి ఇచ్చారని జీవీ రెడ్డి ఆరోపించారు.