AP: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి స్వర్ణ కళ
ఏపీ టూరిజానికి అర్ధ శతాబ్దం పూర్తి.... తిరిగి గాడినపడుతున్న ఏపీ టూరిజం.. వైసీపీ పాలనలో పర్యాటకం గందరగోళం.. మళ్లీ పుంజుకుంటున్న పర్యాటక రంగం
వైసీపీ ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో హోటళ్లు, రిసార్ట్లు, వినోద కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యాటకులను ఆకట్టుకునేలా వినూత్న సేవలు ప్రారంభిస్తోంది. 1976 ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) బుధవారం నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ప్రారంభ దశలో కొన్ని హరిత హోటళ్లు, పరిమిత వసతులతో మాత్రమే సేవలందించిన ఈ సంస్థ, అంచెలంచెలుగా విస్తరించి ఇప్పుడు రాష్ట్ర పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. హరిత హోటళ్లు, రిసార్ట్లు, పర్యాటక ప్యాకేజీలు, ఆధ్యాత్మిక యాత్రలు, జల విహారాలు వంటి అనేక రంగాల్లో సేవలను విస్తరించింది. ఏపీటీడీసీ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం సుమారు 27.8 కోట్ల దేశీయ పర్యాటకులు, దాదాపు 1.8 లక్షల విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. పర్యాటక రంగంలో చూపిన ప్రగతికి గుర్తింపుగా 2025లో ఏపీటీడీసీకి గ్లోబల్ టూరిజం అవార్డు కూడా లభించింది. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం కీలక మలుపుగా మారింది. ఈ హోదా కారణంగా పీపీపీ విధానంలో రూ.17,973 కోట్ల పెట్టుబడులకు 103 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా దాదాపు 97,876 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు, ప్రీమియం రిసార్ట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 2028 నాటికి 50 వేల గదులు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో హోటల్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. పర్యాటక రంగం రాష్ట్ర స్థూల విలువ (GVA)లో ప్రస్తుతం 4.6 శాతం వాటా కలిగి ఉండగా, 2029 నాటికి దాన్ని 8 శాతానికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతోంది. పీపీపీ విధానంలో పర్యాటక శాఖ భూములను లీజుకు ఇస్తోంది. సొంత భూముల్లో హోటల్ నిర్మాణాలు చేపట్టే వారికి స్టాంపు డ్యూటీ, విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను, జీఎస్టీ తదితర అంశాల్లో రాయితీలు అందిస్తోంది. ఈ రాయితీలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు అధికారులు పేర్కొంటున్నారు.