CBN: ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు దిశా నిర్దేశం
ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని హితవు... రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చ;
ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అక్టోబరు తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని.... డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని... వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమన్నారు. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుందని... కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.... శాఖల సంబంధిత అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలన్నారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని తెలిపారు..
ఉచిత ఇసుక పంపిణీలో వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలనిని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు. ఈనెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నారు. పంటలబీమా పథకం అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నామని.... గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందని చంద్రబాబు వివరించారు. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తండ్రి పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మన్. ఈ ముగ్గురూ కలిసి బియ్యం రీ సైక్లింగ్ చేసి కిలో రూ.43కి ఎగుమతి చేశారని ఆక్షేపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంనాటికి ఏం చేద్దాం అనే దానిపై విధివిధానాలతో రావాలని నిర్ణయించారు.
మరోవైపు ఉచిత ఇసుకవిధా నాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. సతివాడ వద్ద టీజీఐ కంపెనీ ఏడేళ్లుగా మూత పడినా, ఈ పరిశ్రమ వద్ద నిల్వ ఉండే ఇల్మనైట్, రుటైల్, ఇసుక చోరీకి గురవుతుండడంతో మైనింగ్ విజిలెన్స్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీ లించారు. సముద్రతీరం నుంచి కూడా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. పాలన మారడంతో అధికారులు, సిబ్బంది పని తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. 48 సచివాలయాలను నాలుగు జోన్లగా ఏర్పాటు చేసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షిస్తామని తెలిపారు. విలీన పంచాయతీల పరిధిలో సచివాలయాలకు సైతం కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ సమన్వయంతో నగరాభివృద్ధికి పనిచేయాలని కోరారు.