AP News: అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు

తొలి 5 నెలల్లోనే 53 వేల 557 కోట్ల రుణం;

Update: 2023-10-14 02:45 GMT

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది. ఏ రాష్ట్రానికీ అందనంత స్థాయిలో రుణాలు తెచ్చుకుంది. కాగ్‌ హెచ్చరించినా వినిపించుకోకుండా, ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే 53 వేల 557 కోట్ల రుణం తీసుకుంది. ఏడాది మొత్తానికి చేస్తామన్నదాంట్లో ఇది 98 శాతం కావడం. అప్పు లేనిదే రోజు గడవట్లేదని స్పష్టంచేస్తోంది. పైగా తెచ్చిన దాంట్లో అంతంత మాత్రంగానే మూలధన వ్యయంపై ఖర్చు చేస్తుండటంతో అభివృద్ధిపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌కు రుణాలను భరించే సామర్థ్యం లేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ - కాగ్‌ నివేదిక ఎప్పుడో హెచ్చరించినా జగన్‌ ప్రభుత్వం వాటిని వినే పరిస్థితిలో లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ తన ధోరణిలో సాగిపోతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లోనే దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనంత అప్పులు చేసేసింది. ఆగస్టు నెలాఖరు వరకు వివిధ రాష్ట్రాల కాగ్‌ గణాంకాలు పరిశీలిస్తే ఏ రాష్ట్రానికీ అందనంత ఎక్కువ స్థాయిలో ఏపీ రుణాలు తీసుకుంది. 53 వేల 557 కోట్ల రుణాలు తీసుకున్నట్లు... రాష్ట్ర ప్రభుత్వమే కాగ్‌కు తెలిపింది. దేశంలోని 14 కీలక రాష్ట్రాల రుణాల తీరులను కాగ్‌ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే వాటి దరిదాపుల్లో లేనంత అధికంగా అప్పులు చేసినది ఆంధ్రప్రదేశే


 దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, గతంలో బాగా అప్పులు చేసి, తొలి 10 స్థానాల్లో ఉన్నాయని, కేంద్రం ప్రస్తావించిన రాష్ట్రాలను కూడా పోల్చిచూసినా వాటన్నింటిలోనూ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. ఏపీ తొలి అయిదు నెలల్లో 53 వేల 557 కోట్ల అప్పు చేస్తే, ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడు 33 వేల ౧౪౨ .76 కోట్లు తీసుకున్నట్లు కాగ్‌ పేర్కొంది. అసలు కాగ్‌కు రాష్ట్రప్రభుత్వం తన గ్యారంటీ రుణాల వివరాలు సమర్పించ లేదు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలూ చెప్పలేదు. అవన్నీ కలిపితే ఈ రుణం ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏడాది మొత్తానికి 54 వేల 587.52 కోట్ల అప్పు చేస్తామని ఏపీ ప్రభుత్వం చట్టసభలకు హామీ ఇచ్చింది. తొలి నాలుగు నెలల్లోనే అంచనాల్లో 98శాతం మేర రుణాలు తీసేసుకోవడం గమనార్హం. 

అప్పులు తీసుకున్నా ఆస్తుల సృష్టికే వాటిని వినియోగించాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మూలధన వ్యయం తక్కువే. తొలి 5 నెలల్లో మూలధన వ్యయం రూపేణా 15వేల883 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్‌కు ఏపీ ప్రభుత్వం తెలిపినా అందులోనూ అనేక మతలబులున్నాయి. అసలు నిధులు వెచ్చించకుండానే ఖర్చులు రాసేసే పి.డి. ఖాతాల మాయాజాలంలో ఈ వ్యవహారం చేరిపోయింది. ఇందులో 6వేల కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు రాసేసిన వ్యవహారాలే ఉన్నాయి.  

Tags:    

Similar News