Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ ఇష్యూపై సిట్.. 9 మందికి బాధ్యతలు
తిరుమల లడ్డు వ్యవహారంపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అందులోని సభ్యుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్సార్ జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు, తిరుపతి అదనపు ఎస్పీ వెంకటరావు, డీఎస్పీలు జి.సీతారామరావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఎస్బీ ఇన్స్పెక్టర్ టి.సత్య నారాయణ, ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం.సూర్య నారాయణను సభ్యులుగా నియమించారు. మొత్తం 9 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సమావేశమై తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చించారు. డీజీపీ వారికి పలు సూచనలు చేశారు.