Dhulipalla Narendra: ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వ అస్త్రం..

Dhulipalla Narendra: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రాన్ని సంధించినట్టు కనిపిస్తోంది.;

Update: 2021-10-27 06:51 GMT

Dhulipalla Narendra (tv5news.in)

Dhulipalla Narendra: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రాన్ని సంధించినట్టు కనిపిస్తోంది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని 6A కింద DVC ట్రస్టును.. ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్‌ ఇచ్చిన ఈ నోటీసులకు త్వరలోనే సమాధానం చెప్తామని ధూళిపాళ్ల నరేంద్ర చెప్తున్నారు. ట్రస్ట్‌ వ్యవహారాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉన్నాయని, అన్నింటికీ వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో కమిషనర్ పేర్కొన్న నేపథ్యంలో ఆ సమాచారమంతా పంపిస్తామంటున్నారు.

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు ద్వారానే DVC ఆసుపత్రి నడుస్తోంది. ఇందులో పాల రైతులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితీతో వైద్య సేవలు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్‌ను ప్రభుత్వం తన కిందకు తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే సంగం డైరీ స్వాధీనానికి అనేక ప్రయత్నాలు చేసిన సర్కార్.. ఇప్పుడు ట్రస్ట్‌పైన దృష్టిపెట్టడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ కనిపిస్తోంది.

Tags:    

Similar News