ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్పై సస్పెన్షన్ వేటు
బ్యాంకుల ముందు చెత్తవేసిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఉయ్యూరు కమిషనర్ ప్రకాశరావును సస్పెండ్ చేసింది.;
కృష్ణాజిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు మున్సిపల్ సిబ్బంది చెత్త వేయడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడంలేదని.. దీనికి నిరసనగా మున్సిపల్ అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావు అయితే ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు.
బ్యాంకుల ముందు చెత్తవేసిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఉయ్యూరు కమిషనర్ ప్రకాశరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు ముందు కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది, లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ముందు చెత్తవేయడం బాధాకర అంశమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. ఈ విషయంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు దెబ్బతిని ఉంటే తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు.
అయితే ప్రకాశరావు క్షమాపణ చెప్పిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం గమనార్హం. మరోవైపు ఈ తరహా ఘటనపై మచిలీపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లను ప్రభుత్వం వివరణ కోరింది.