AP: రేషన్ బియ్యం వాహనాలపై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
పౌరసరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... కీలక అంశాలను లేవనెత్తిన నాదెండ్లు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన పౌరసరఫరాల శాఖ, రేషన్ బియ్యం పంపిణీ వాహనాలపై కీలక సమీక్ష జరిగింది. ఎండీయూ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎండీయీలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎండీయూ వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై కసరత్తు చేయాలని సీఎం చెప్పుకొచ్చారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని మంత్రి అన్నారు. వీధి చివర వాహనం పెట్టి మాత్రమే బియ్యం పంపిణీ చేశారు.. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9260 వాహనాలు గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు వెల్లడించారు. రేషన్ బియ్యం తరలింపు వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్నారన్న అంశంపై సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చారు.
రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో సమావేశం పెడదామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులకు నిర్ణయం తీసుకున్నారు. పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉంచాలని మంత్రులతో పాటు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 2019 ముందు వరకు సివిల్ సప్లైస్ శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా.. ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ. 41550 కోట్లకు తీసుకువెళ్లిందని ముఖ్యమంత్రి అన్నారు. రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
స్కిల్ సెన్సెస్కు యాప్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. స్కిల్ గణన చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... దీన్ని వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం చదువుకున్న వారి వివరాలే కాకుండా అందరిలో ఉన్న స్కిల్ను వెలికితీసే దిశగా చర్యలు తీసుకుంటోంది. 15ఏళ్ల నుంచి దాదాపు అరవై ఏళ్ల వరకు వయసున్న వారి స్కిల్స్ను గుర్తించేందుకు ఈ గణన ఉపయోగపపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఇష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది ప్రభుత్వం. స్కిల్ గణన కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ప్రజల నైపుణ్యాలు, వారు ఇంకా ఏ రంగంలో రాణించాలనే ఆలోచనలో ఉన్నారో తెలుసుకోనుంది. కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి వివరాలే కాకుండా వ్యవసాయం సహా ఇతర చేతి వృత్తుల వారిని కూడా ఈ విభాగంలోకి తీసుకురానుంది. ఇలా చేయడం వల్ల ఏ రంగంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో తెలియనుంది. వారికి ఉన్న ఆసక్తి తెలుసుకొని వారికిని ట్రైనింగ్ ఇవ్వడం అందులో లేటెస్ట్ విధానాలు వివరించగలుగుతామని ప్రభుత్వం యోచిస్తోంది.