AP: ఏపీలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు
పవన్ చొరవతోనే గడువు పొడిగింపు... పవన్ ప్రతిపాదనకు కేంద్రం సమ్మతి... జల్ జీవన్ మిషన్ పనులపై వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది. జల్ జీవన్ మిషన్ పనులపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్.. ఇంటింటికి సురక్షిత తాగు నీటి సరఫరా లక్ష్యంగా పనుల్లో వేగం పుంజుకుంది. తొలిసారి గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం మొత్తం సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. శాఖ అంతర్గత సామర్థ్యం పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. నీటి శుద్ధి, నాణ్యత, సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏడాదిలో రూ. 7,910 కోట్ల జల్ జీవన్ పనులకు శ్రీకారం చుట్టగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నీటి నాణ్యత.. శుద్ధి.. సరఫరాలకు ప్రాధాన్యత ఇస్తూ మునుపెన్నడూ లేని విధంగా క్షేత్ర స్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నత స్థాయి ఇంజినీర్ వరకు... గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో అతి పెద్ద తాగునీటి ప్రాజెక్టు
జల్ జీవన్ మిషన్ పథకం కింద గత జులై 4వ తేదీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు నీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా 1,290 కోట్లతో మెగా ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా పరిధిలో ఇంత పెద్ద తాగునీటి ప్రాజెక్టు ప్రారంభించటం ఇదే ప్రథమం. దీంతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తాగు నీటి సరఫరా మెగా ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పనిని పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్దత, దూరదృష్టితో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు చకచకా ముందుకు సాగుతున్నాయి. 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల పనులను పథకం విస్తరణలో ప్రారంభించి దానికి అనుగుణంగా పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరుతుంది. రానున్న 30 ఏళ్ల కాలానికి, కోటీ 21 లక్షల 71 వేల మందికి రక్షిత మంచినీటి ఇవ్వాలన్న సంకల్పం నెరవేరుతుంది.