AP: అభివృద్ధి దిశగా చంద్రబాబు అడుగులు
సామాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు... బీసీ వర్గాలకు వన్నె తెచ్చేలా పనిచేస్తానన్న పల్లా శ్రీనివాసరావు;
గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సామాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని.. చంద్రబాబు నేరుగా పింఛన్లు పంపిణీ చేసారని తెలిపారు. వారి వారి నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఎన్నికల సమయంలో శవ రాజకీయాలు చేసిన జగన్... 34 మంది వృద్ధుల మరణాలకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా బీసీ వర్గాలకు వన్నె తెచ్చేలా పనిచేస్తానని వెల్లడించారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. సీఎంను కలిసేందుకు ఎక్కువ మంది ప్రజలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి జన సందోహం ఎక్కువైందని, వారికి ఇబ్బంది కలగకుండా టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
7306299999కు కాల్ చేసి వారి సమస్యలు చెప్తే సీఎంను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పరిష్కారం కాని సమస్యలు ఉన్నప్పుడే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తే బాగుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం టీడీపీ నేతలపై దురుద్దేశంతో పెట్టిన కేసులను కోర్టుల్లో మాఫీ అయ్యేలా కృషి చేస్తామన్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న రాజమండ్రికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి హితేసి తల్లిదండ్రులు ప్రీతమ్, గాయత్రి పల్లా శ్రీనివాసరావును కలిసి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని కోరారు. పాప ట్రీట్మెంట్ కోసం రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని, దాని కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు.. ప్రజలు, ఎన్ఆర్ఐలు, బిజినెస్ హోల్డర్లు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సాయం చేయాలని శ్రీనివాసరావు కోరారు. ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత రవాణ సదుపాయంపై ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు శుభవార్త చెబుతామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామన్న రామప్రసాదరెడ్డి... అవి చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి... గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.