APSRTC: వైసీపీ సభలకు రథాల్లా ఆర్టీసీ బస్సులు

మేదరమెట్ల సభకు 3 వేల బస్సులు... ప్రయాణికుల అవస్థలను పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం

Update: 2024-03-10 00:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారంలోకొచ్చాక ఆర్టీసీ బస్సులు వైసీపీ సభలకు జనాన్ని తరలించే రథాల్లా మారాయి. నేడు మేదరమెట్లలో వైసీపీ నిర్వహిస్తున్న సభకు 3 వేలకు పైచిలుకు బస్సులను తరలించారు. సీఎం జగన్‌ వద్ద స్వామిభక్తిని చాటుకోవడమే ముఖ్యమని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. సాధారణ ప్రయాణికుల ఇక్కట్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . అదేసమయంలో 4 వేల మందికి పైగా పోలీసులూ సీఎం సభ విధులకు సిద్ధమయ్యారు. పార్వతీపురం నుంచి బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల 610 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 40 బస్సులను మేదరమెట్లలో నేడు నిర్వహించే సిద్ధం సభకు తరలించారు. 570 కిలోమీటర్ల దూరంలో ఉన్నశ్రీకాకుళం నుంచి 50 బస్సులు, 470 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ నుంచి 150 బస్సులు తరలించారు.


అల్లూరి జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల నుంచి బస్సులు కేటాయించింది. అత్యధికంగా నెల్లూరు జిల్లా నుంచి 360 బస్సులు, పల్నాడు నుంచి 300, ప్రకాశం నుంచి 290, ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 270, గుంటూరు నుంచి 225, కృష్ణా నుంచి 170, బాపట్ల జిల్లా నుంచి 150 బస్సులను పంపారు. తిరుపతి నుంచి 155 బస్సులతోపాటు రాయలసీమలోని మిగిలిన ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 985 బస్సులు కేటాయించారు. మొత్తంగా సభకు ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి 3 వేల 500 బస్సులను కేటాయించి ఆర్టీసీ మరోసారి స్వామిభక్తిని ఘనంగా చాటుకుంది. రాయలసీమ జిల్లాల బస్సులు శనివారమే వెళ్లడంతో ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి బస్సుల కొరత ఏర్పడింది. గత నెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు 3 వేల బస్సులు పంపించి ప్రయాణికులకు నరకం చూపడంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం అవేవీ తమకు వినిపించలేదనట్లుగా .. సీఎం సేవలో తరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ సొంత, అద్దె బస్సులు కలిపి 10వేలు ఉండగా.. ఇందులో 3,500 సిద్ధం సభకు తరలించారు. అంటే ప్రతి మూడు బస్సుల్లో ఒకటి సీఎం సభకు వెళుతోంది. ఇవన్నీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులే. దీంతో ఎవరైనా ఇవాళ బస్సులో ప్రయాణించాలి అనుకుంటే నరకం చవిచూడాల్సిందే. చాలా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లే అవకాశాలు లేవు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు డిపోల్లోని 70 నుంచి 80 శాతం బస్సులు సీఎం సభకు వెళ్లిపోయాయి. ఇటీవల రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు పంపిన బస్సులకే వైకాపా పెద్దలు పూర్తిగా చెల్లింపులు చేయలేదు. ఇంకా కోటి రూపాయలకు పైగా బకాయి ఉన్నట్లు తెలిసింది. తాజాగా మేదరమెట్ల సభకూ డబ్బులు చెల్లించకపోయినప్పటికీ. అధికారులు ఉదారంగా వ్యవహరించారు. 3 వేల 500 బస్సులకు 7 కోట్లకు పైగా అవుతుందని అధికారులు అంచనా వేయగా. ఇందులో సగమే నేతలు చెల్లించినట్లు సమాచారం. అధికారులు అంచనా వేసిన సొమ్ము మొత్తం చెల్లించే వరకూ సాధారణంగా ఎవరికీ బస్సులివ్వరు. కానీ అధికార పార్టీ నేతలు అడిగిందే తడవుగా వాళ్లు ఏయే నియోజకవర్గం నుంచి ఎన్ని బస్సులు కోరారో అక్కడి నుంచి సిద్ధం చేశారు. ఇవి సరిపోనట్టు... వివిధ జిల్లాల్లోని దాదాపు 2 వేల బడి బస్సులను అధికార పార్టీ నేతలు బలవంతంగా తీసుకున్నారు. రవాణా అధికారుల ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News