తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో వన్యప్రాణుల దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది.రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకుంటారనగా.. ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసిందని. కుటుంబసభ్యులు భయంతో కేకలు వేయడంతో అడవిలోకి ఈడ్చుకెళ్లిందని డీఎఫ్ఓ తెలిపారు.
ఇక పాప కనిపించక పోవడతో టీటీడీ అధికారులకు, పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలు పడలేదు. ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక మృతదేహాంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం. లక్షిత మృతితో కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం లో విషాద ఛాయలు అలముకున్నాయి. పాప మృతి పై బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తిరుమలలో వరుస ఘటనలతో భక్తుల్లో భయాందోళన నెలకొంది.