CBN: నూతన గ్రీన్ ఫీల్డ్ నగరంగా అవతరిస్తోన్న అమరావతి
ఆర్థిక సర్వేలో ప్రాధాన్య నగరంగా అమరావతి
అమరావతిను భవిష్యత్ భారత అవసరాలకు తగిన విధంగా నూతన గ్రీన్ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో అమరావతిని ప్రాధాన్య నగరంగా పేర్కొనడం రాష్ట్రానికి లభించిన కీలక గుర్తింపని ఆయన వ్యాఖ్యానించారు. దేశం వేగంగా ఆర్థిక పురోగతి దిశగా సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2038 నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. అలాగే 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
విస్తృత ప్రణాళికతోనే...
రాజధాని నిర్మాణంపై గతంలో అనేక విమర్శలు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. “రాజధానికి అంత భూమి ఎందుకు? వంద ఎకరాల్లోనే సచివాలయం కట్టొచ్చుగా” అని చాలామంది ప్రశ్నించారని తెలిపారు. అయితే ఒక రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలంటే, అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందాలంటే విస్తృత ప్రణాళికతో రాజధాని నిర్మాణం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల రాజధానులను ఉదాహరణగా పేర్కొంటూ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ వంటి బలమైన నగరాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అమరావతిని చిన్న నగరంగా పరిమితం చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే హైదరాబాద్ కంటే మెరుగైన మౌలిక సదుపాయాలతో, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గత 30 ఏళ్లలో ప్రపంచం ఎంతో వేగంగా మారిందని, సాంకేతికత, పెట్టుబడులు, మౌలిక వసతుల రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సీఎం తెలిపారు. ఈ మార్పులకు అనుగుణంగా రాష్ట్ర రాజధానిని ఆధునికంగా రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ఆర్థిక, విద్య, వైద్య, సాంకేతిక రంగాలకు కేంద్రంగా మారుతుందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్న సీఎం
భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతోందనే అంశంపై విద్యార్థులు కూడా అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీచర్ల ట్రైనింగ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏడాదికి 5 వేల మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా శిక్షణ ఇవ్వనున్నట్టు ఆగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం అకాడమీ ప్రాగంణంలోనే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకోవడం వల్లే ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశాను.. ఇప్పుడు ఏఐ గురించి అందరూ ఆలోచన చేయాలని చెబుతున్నా. విద్యార్థులు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.. భవిష్యత్ మనదే. అని చంద్రబాబు అన్నారు.