CBN: తెలంగాణతో మాకెందుకు పోరాటం..?
బనకచర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా?;
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. " గోదావరిలో పుష్పలంగా నీళ్లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రెండూ వాడుకోవచ్చు. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువున్నాయి. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందాం" అని చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను ఏనాడూ అడ్డుచెప్పలేదన్న ఆయన.. తెలంగాణపై భాగంలో ఉందని.. కింద ఉన్న ఏపీ నీళ్లు వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు, అభ్యంతరాలు ఎందుకు అని అడిగారు. "తెలంగాణలోనూ ప్రాజెక్టులు కట్టాలి.. ప్రజలు, రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటాను.. అంతేకానీ ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయను" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు చంద్రబాబు సూచించారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు.
అభివృద్ధి కొనసాగాలి
హైదరాబాద్ తాను అభివృద్ధి చేశాక.. వైఎస్ రాజశేఖర్రెడ్డి కంటిన్యూ చేశాడని చంద్రబాబు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా నీటిపారుదల ప్రాజెక్ట్లు తానే ఆరంభించానని చంద్రబాబు అన్నారు. వాదన.. ఏదైనా చెయ్యచ్చు… కానీ, కొట్లాట వల్ల ఉపయోగం లేదు అన్నారు.. గొడవ పడితే ప్రజల్ని మభ్య పెట్టినట్టు.. తాను గొడవ పడితే ప్రయోజనం లేదు అన్నారు.. హైదరాబాద్ వల్ల ఆదాయం వస్తోంది.. తనకు అది సంతోషమని అన్నారు. "హైదరాబాద్.. అమరావతి నా ఉద్యోగం కోసం కట్టానా? అని ప్రశ్నించారు.. బనకచర్ల ప్రాజెక్టు పై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరం అయితే ఢిల్లీలో కూర్చుని మాట్లాడతా" అని చంద్రబాబు వెల్లడించారు. గోదావరి నుంచి నీళ్లను వేరే బేసిన్కు తీసుకువెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి నీళ్లతో కాళేశ్వరం కట్టినప్పుడు తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్లు ఉన్నారని.. తాను తెలంగాణ వాళ్లతో ఎప్పుడూ గొడవ పడలేదన్నారు. గొడవ పడటం అనేది ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. తాను హైదరాబాద్ను ఏపీ కోసం అభివృద్ధి చేశానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్ కావాలని ఎలా అడుగుతానని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రాజెక్టులు అన్నీ కట్టుకోండి
మీరు కట్టే ప్రాజెక్ట్లు అన్ని కట్టండి.. పోరాటాలు తర్వాత చేయొచ్చు. మేం హామీ ఇచ్చింది డబుల్ ఇంజన్ సర్కార్. అంటే దాని అర్థం ఏమిటో తెలుసుకోండి. అందరు కలిసి రాష్ట్రాలను పోటీ పడి అభివృద్ధి చేయాలనేది నా కోరిక. తెలుగు జాతిని నంబర్ వన్గా చేయడం అందరి బాధ్యత.. అందుకోసం అందరం పని చేద్దాం. నేను ఎవరితో గొడవ పెట్టుకోను.. కానీ రాష్ట్రం హితం కోసం పోరాడుతా. బనకచర్ల వల్ల ఎవరికీ నష్టం లేదు. వరద జలాలను మాత్రమే వాడతామని చెప్పాం.’ అని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ వ్యతిరేకించలేదు..
బనకచర్ల విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. ఎవరికి అన్యాయం జరగకండా చేద్దామని అంటున్నారని చెప్పారు. మనం మనం తిట్టుకోవడమే కావాలని కొంతమంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే అందరం కలిసి పోటీ పడి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని, రాబోయే 20 ఏళ్ల తర్వాత ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నంబర్ స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
వ్యతిరేకిస్తున్న తెలంగాణ..
బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. నాడు కేసీఆర్, జగన్ కలిసి రాయలసీమకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ లింక్ చేయడం వల్ల తెలంగాణ నష్టపోయే అవకాశం ఉందని ఆరోపిస్తోంది.