CHANDRABABU: కూటమి పాలనకు ఏడాది పూర్తి
అభివృద్ధి పథంలో కూటమి సర్కార్.. వేగంగా పోలవరం, అమరావతి పనులు;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయింది. గత ఎన్నికల్లో వైసీపీని పూర్తి స్ధాయిలో మట్టికరిపించి 164 సీట్లతో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ మెజార్టీతో తను గెలిపించిన ప్రజలకు దగ్గరయ్యేందుకు, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వపరిపాలన – స్వర్ణాంధ్ర ప్రదేశ్ పేరుతో అమరావతిలో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. అమరావతిలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ సచివాలయం వెనక సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ విజన్ వంటి అంశాలపై వివిధ శాఖలు ప్రజంటేషన్లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది. దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ ను వివరించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలైన హామీలతో పాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ప్రణాళికను కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ విడుదల చేయబోతున్నారు.
జోడెడ్లపై కూటమి పరిపాలన
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అమరావతి పనులు పరుగులు పెట్టాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. కేంద్రం సాకారంతో అనేక అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వంటి హామీలను నెరవేర్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. డిజిటల్ పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించి.. అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏడాది వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.**
ఏడాది పూర్తయిన వేళ తీయ్యని కబురు
కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం తియ్యని వార్త చెప్పింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తోంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడు నిధులు జమకానున్నాయి. 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8 వేల 745 కోట్లు జమచేయనుంది ప్రభుత్వం. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్టియర్లో చేరే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి రేపటితో ఏడాది పూర్తి. ఈ సందర్భంగానే ఈ పథకాన్ని అమలుచేస్తోంది ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయం కోసం జూన్20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తారు.. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.. విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కాగా, సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం అమలుపై నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు శుభాకాంక్షలు: మంత్రి లోకేశ్
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం అమలుకు శ్రీకారం చుట్టామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా తల్లులకు అభినందనలు.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం అందుతుందన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 అమలు చేశామని పేర్కొన్నారు. పార్టీల సంగతికి వస్తే మూడు కూటమి పార్టీల మధ్య మంత్రిత్వ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకూ.. పరస్పర అవగాహనతో పాలన సాగుతోంది. అలాగే ప్రభుత్వం డిజిటల్ పాలనపై ఎక్కువ దృష్టి పెడుతోంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు.