ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు, శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కర్నూల్ జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-.. మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. ‘ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం’ అని చంద్రబాబు తెలిపారు.