తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈనెల 28న బెంగళూరు నగరానికి వెళ్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్టు చేసిన సమయంలో కర్ణాటక ప్రజలు అండగా నిలబడి భారీ నిరసనలతో మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్వయంగా కృతజ్ఞతలు తెలియచేయనున్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతోపాటు కర్ణాటకలోని తెలుగుదేశం అభిమానులతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఏపీలో వైసీపీ అరాచక, అవినీతి పాలనపై పోరాడుతూ అక్రమ కేసులో జైలుకెళ్లి విడుదలయ్యాక తొలిసారి బెంగళూరుకు వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ ఫోరం శ్రేణులు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు సమావేశానికి హాజరు కావాలని టీడీపీ ఫోరం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బెంగళూరు సంతమారనహళ్లిలోని వైట్ఫీల్డ్-హొసకోటె రోడ్డులోగల కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. కాగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాలరెడ్డి, పార్టీ సీనియర్ నేత గురజాల జగన్మోహన్, బెంగళూరు టీడీపీ ఫోరంనకు చెందిన కనకమేడల వీరాంజనేయులు, సోంపల్లి శ్రీకాంత్ ఏర్పాట్లను పరిశీలించారు.