AP: ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం

కూటమి ప్రభుత్వ విజన్ అదే.. పారిశ్రామికవేత్తల ద్వారానే సంపద సృష్టి.. సీఐఐ సదస్సులో చంద్రబాబు స్పష్టీకరణ;

Update: 2025-05-31 06:30 GMT

సంపద సృష్టి జరగాలని, అది పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఐఐ సదస్సులు నిర్వహించానని, తాను మొదటి నుంచీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించానని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించి బిజినెస్ ప్రారంభమైతేనే ఆదాయం పెరుగుతుందన్నారు. అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వగలమని పేర్కొన్నారు. ఇప్పుడు చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్న చంద్రబాబు... బిజినెస్ సెక్టార్‌లో ఉన్న భయాలు తొలగించే ప్రయత్నం మహానాడు వేదికగా చేశామని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక మీటింగ్‌లో పాల్గొన్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల అవకాశాలు వచ్చిన వాళ్లకు వివరించారు. దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని, అక్కడికి వెళ్లొద్దని కొందరు తనకు సూచించారని చంద్రబాబు తెలిపారు. అక్కడ ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు ఓట్లు వేయరని చెప్పారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధాని కూడా దావోస్‌ వెళ్లలేదని పేర్కొన్నారు.

30 ఏళ్లుగా దావోస్‌ వెళ్తున్నా

1995 నుంచి తాను మాత్రమే దావోస్‌‌కు తరచూ వెళ్తున్నానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సరైన సమయంలో దేశానికి ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నారని ప్రశంసించారు. భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు. చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏడు రెట్లు ఎక్కువని వివరించారు సీఎం చంద్రబాబు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు చేయాలన్నదే లక్ష్యమన్నారు. మొదటి నుంచి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తూ వచ్చామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అనేక సదస్సు నిర్వహించి భారీగా పెట్టుబడులు ఆహ్వానించామని తెలిపారు. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నామని వివరించారు. సరైన పాలసీలు రూపొందిస్తే మన ప్రగతిని ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశానికి రానున్న పదేళ్లు అత్యంత కీలకమని అన్నారు.

Tags:    

Similar News